గుంతకల్లు – బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిర్ణయం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టును ఆమోదించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నూతన రైల్వే మార్గాల వల్ల తూర్పు, పశ్చిమ రైల్వే కారిడార్ మరింత బలోపేతం కావడంతో పాటు… రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానం గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రయాణికుల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరకు రవాణా వేగవంతమై, ప్రస్తుతం ఉన్న మార్గాలపై రద్దీ తగ్గుతుంది. మొత్తం రూ.1,264 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.600 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఖర్చు కానున్నాయి.
ఈ రైలు మార్గాల ద్వారా పరిశ్రమలకు ఊతం లభించడమే కాకుండా కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. దీనివల్ల కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టింపబడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వేగవంతమైన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.









