రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాశ్లతో పాటు పలువురు కూటమి ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ పర్యటనలో పాల్గొని లోకేశ్కు బ్రహ్మరథం పట్టారు.
ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు నుంచి పునాదిపాడు వరకు కిలోమీటర్ల మేర నిర్వహించిన భారీ ర్యాలీతో పెనమలూరు నియోజకవర్గం హోరెత్తింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ జెండాలు చేతబూని, ‘జై తెలుగుదేశం’ నినాదాలతో ముందుకు సాగారు. ర్యాలీ పొడవునా మంత్రి లోకేశ్ ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ, స్థానికుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
ఈ పర్యటనలో భాగంగా కంకిపాడు మండలం పునాదిపాడులో నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కంకిపాడులోని అయానా కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన పెనమలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.









