ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తన క్రికెట్ కెరీర్ను మలుపు తిప్పడమే కాకుండా అంతర్జాతీయ ఆటగాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం కల్పించిందని ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ తెలిపారు. వివిధ IPL ఫ్రాంచైజీల తరఫున ఆడటం ద్వారా తన ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయని, భారత ఆటగాళ్ల క్రికెట్ విధానాన్ని దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు.
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో మైదానంలోనూ, వెలుపల సన్నిహితంగా మెలిగే అవకాశం తనకు లభించిందని హెన్రిక్స్ వెల్లడించారు. టీమిండియా ఆటగాళ్ల మానసిక దృక్పథం, వారి ఆటతీరు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించే వ్యూహాలు, ప్రత్యర్థులను ఎదుర్కొనే విధానాన్ని ఐపీఎల్ ద్వారా దగ్గరగా గమనించానని చెప్పారు. ఈ అనుభవం అంతర్జాతీయ క్రికెట్లో తనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.
అయితే ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోసం పోరాడుతున్న సమయంలో తనకు క్రికెట్ బోర్డు నుంచి తగినంత మద్దతు లభించలేదని హెన్రిక్స్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎదురైన పరిస్థితులు తనపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఐపీఎల్లో లభించిన అనుభవాలు, ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడిన అవకాశాలు తన క్రికెట్ ప్రయాణంలో ఎంతో విలువైనవిగా నిలిచాయని తెలిపారు.









