నేపాల్లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన ఏడుగురు యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. నలుగురు సురక్షితంగా ఉండగా.. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఆచూకీ ఇంకా లభించలేదు.
ముగ్గురి ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. శశికుమార్ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు అధికారులు తెలిపారు. చైనా, నేపాల్ అధికారులతో సమన్వయం కొనసాగించాలని సూచించారు.
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. వారిని వీలైనంత త్వరగా తరలించేందుకు చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు. భారత రాయబార కార్యాలయం, చైనా-నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు.









