విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తర్లువాడలో జరిగిన గూగుల్ ఏఐ హబ్ భూమి పూజ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టెక్ దిగ్గజం గూగుల్ రాకతో విశాఖ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మంత్రంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, డబుల్ ఇంజిన్ సర్కార్తో మరిన్ని ప్రయోజనాలు రాబోతున్నాయని, గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖకు ఇకపై ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనపై లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడిదారులు ఏపీ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని, కానీ 2024లో ప్రజలు ఎన్డీయేకు పట్టం కట్టాక మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ మొదలైందని ఆయన అన్నారు. గూగుల్ లాంటి సంస్థలు వస్తే స్వాగతించాల్సింది పోయి, దానిని అడ్డుకునేందుకు రాయలసీమకు చెందిన ఓ వైసీపీ ఎంపీ పిల్ వేయడం దారుణమన్నారు. మంచి పనులు చేయడం చేతకాని వారు, వేరేవాళ్లు ప్రాజెక్టులు తెస్తుంటే చూసి ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ తీరును విమర్శిస్తూ.. “మాది గూగుల్, మీది గొడ్డలి.. బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్” అంటూ నారా లోకేష్ పవర్ఫుల్ పంచ్ వేశారు. ఈ రోజు తాము భూమి పూజ చేస్తే, గూగుల్ సెంటర్ను తామే తెచ్చామని రేపు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గూగుల్ సెర్చ్లో వెతికినా గూగుల్ను రాష్ట్రానికి తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా వస్తుందని లోకేష్ స్పష్టం చేశారు.









