కర్ణాటకలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన డి.కె. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో శాఖల కేటాయింపు వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ కేటాయిస్తానని చెప్పి, తీరా నీటిపారుదల శాఖ ఇవ్వడంతో అసంతృప్తికి గురైన సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందిస్తూ.. రామలింగారెడ్డి తమ పార్టీకి అత్యంత సీనియర్ నేత మాత్రమే కాకుండా, తనకు అత్యంత ఆప్తమిత్రుడని అన్నారు. త్వరలోనే ఆయనతో స్వయంగా మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
అయితే ముఖ్యమంత్రి ప్రకటనపై రామలింగారెడ్డి తీవ్రంగానే స్పందించారు. సీఎం డీకే శివకుమార్ తనకు ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందే తన నివాసానికి వచ్చి బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయిస్తానని ఆయనే స్వయంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ అవమానాన్ని భరించలేకే తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. ఒకవేళ ఇప్పుడు తనపై ఒత్తిడి తెచ్చి, తాను కోరుకున్న శాఖను ఆఫర్ చేసినప్పటికీ ఎంతమాత్రం మంత్రిగా బాధ్యతలు తీసుకోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఒక సాధారణ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసుకుంటానని తేల్చి చెప్పారు.
మరోవైపు ఈ అంతర్గత తిరుగుబాటుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు, అసమ్మతి మొదటిరెండు రోజుల్లోనే ముదిరిపోయాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు. కేవలం ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ సర్దుకోలేదని, రాబోయే రోజుల్లో ఇలాంటి రాజీనామాలు మరిన్ని చూస్తామని వ్యాఖ్యానించారు. 73 ఏళ్ల వయసున్న రామలింగారెడ్డి బెంగళూరులోని బీటీఎమ్ లేఅవుట్ నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన నాయకుడు కావడంతో, ఈ వివాదం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.









