తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలై గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతోనే తాను బీజేపీతో ఉన్న ఆరేళ్ల ప్రయాణానికి ముగింపు పలికినట్లు ఆయన ప్రకటించారు. ఆయన రాజీనామాను పార్టీ అధిష్ఠానం ఆమోదించిన అనంతరం, తమిళనాడు ప్రజల హక్కుల సాధన కోసం మరియు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఆయన ‘వి ద లీడర్స్’ (We The Leaders) అనే సరికొత్త ప్రజా ఉద్యమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
అన్నామలై ప్రారంభించిన ఈ ఉద్యమానికి సోషల్ మీడియా మరియు క్షేత్రస్థాయిలో ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, ఆన్లైన్ లింక్ ద్వారా గత 24 ంటల్లోనే దాదాపు 14 లక్షల మంది (13.85 లక్షలు) ఇందులో సభ్యులుగా చేరి తమ మద్దతును ప్రకటించారు. ఈ ఉద్యమం ద్వారా 2029 పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతామని, అలాగే 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్తులో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు అన్నామలై స్పష్టం చేశారు.
సాంప్రదాయ రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే తరహాలోనే ఇకపై తాను బీజేపీని కూడా చూస్తానని అన్నామలై పేర్కొన్నారు. తమిళనాడు గుర్తింపు, సాంస్కృతిక వారసత్వ విషయాల్లో కేంద్ర అధిష్ఠానంతో తనకు విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను ప్రారంభించిన ఈ ఉద్యమానికి బడా పారిశ్రామికవేత్తల నేపథ్యం గానీ, స్టార్డమ్ గానీ లేవని.. ప్రజల కోసం పనిచేసే తపన మాత్రమే ఉందని చెబుతూ, శాశ్వత ఎమ్మెల్యేలు మరియు ఎంపీల సంస్కృతికి ముగింపు పలికి సామాన్యులతో కూడిన నూతన రాజకీయ వ్యవస్థను నిర్మిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.









