కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్కు పదవి చేపట్టిన రెండు రోజుల్లోనే తొలి అసమ్మతి సవాల్ ఎదురైంది. తనకు ప్రాధాన్యత లేని శాఖ కేటాయించారంటూ సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపింది. చివరి నిమిషం వరకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఆశించిన రామలింగారెడ్డికి జలవనరుల శాఖ కేటాయించడంతో ఆయన అసంతృప్తికి గురై, తన రాజీనామా లేఖను నేరుగా సీఎం వాట్సాప్కు పంపినట్లు సమాచారం.
ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన ట్రబుల్ షూటర్, సీఎం డీకే శివకుమార్ వెంటనే రంగంలోకి దిగి జయనగర్లోని ఒక హోటల్లో రామలింగారెడ్డితో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ బుజ్జగింపుల సమావేశంలో మరికొందరు సీనియర్ మంత్రులు, రెడ్డి సన్నిహితులు కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రామలింగారెడ్డి తనకు 1980 నుండి అత్యంత ఆప్తుడని, ఇది కేవలం ఒక సమాచార లోపం వల్ల తలెత్తిన చిన్న కుటుంబ వ్యవహారమని, ప్రస్తుతం సమస్య పూర్తిగా సమసిపోయిందని స్పష్టం చేశారు.
రామలింగారెడ్డి తన రాజీనామా లేఖను వాట్సాప్లో పంపిన మాట నిజమేనని ధ్రువీకరించిన సీఎం, ఇప్పుడు అంతా సర్దుకుందని పారదర్శకంగా వెల్లడించారు. “అనవసరమైన కల్పిత కథలు సృష్టించకండి, అవన్నీ నిరాధారమైనవి, ప్రభుత్వంలో అంతా సజావుగానే ఉంది” అని డీకే పేర్కొన్నారు. కాగా, ఐదు దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనకు ఇచ్చిన మాట తప్పారంటూ ఆవేదన చెందిన రామలింగారెడ్డి.. మంత్రి పదవి వదులుకున్నా ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతానని చెప్పారు. వీరితో పాటు కే.హెచ్. మునియప్ప లాంటి మరికొందరు సీనియర్లు కూడా తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి గళం వినిపిస్తుండటం గమనార్హం.









