అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక భావోద్వేగపూరితమైన రహస్యాన్ని ప్రపంచంతో పంచుకున్నారు. తాను రాసిన “కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు ఫెయిత్” అనే పుస్తకంలోని విశేషాలను ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కాలమ్లో ప్రస్తావిస్తూ.. తమ కుటుంబంలోకి నాలుగో సంతానం రాబోతుండటం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు. తన భార్య ఉషా వాన్స్ మొదట్లో నాలుగో బిడ్డను కనేందుకు అస్సలు ఆసక్తి చూపలేదని, కానీ తన ప్రాణస్నేహితుడు, రాజకీయ గురువు అయిన కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ చార్లీ కిర్క్ హఠాన్మరణం ఆమె నిర్ణయాన్ని పూర్తిగా మార్చివేసిందని వాన్స్ పేర్కొన్నారు.
వాన్స్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు (ఇవాన్, వివేక్, మిరాబెల్) ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత మరో బిడ్డను కనడానికి ఉష సుముఖంగా లేనప్పటికీ, గత ఏడాది ఉటా కాలేజ్ క్యాంపస్ కాల్పుల్లో ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ మరణించడం వారి జీవితాలను మలుపు తిప్పింది. ఆ సమయంలో చార్లీ భార్య ఎరికా కిర్క్ను ఓదార్చడానికి వెళ్లిన ఉషకు.. “నాకు చార్లీతో కేవలం ఇద్దరే పిల్లలు ఉన్నందుకు చింతిస్తున్నాను” అని ఎరికా చెప్పిన మాటలు తీవ్రంగా కదిలించాయి. ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే కుటుంబం పరిపూర్ణమవుతుందనే భావనతో ఉష తన పాత నిర్ణయాన్ని వదులుకుని నాలుగో బిడ్డ కోసం ప్లాన్ చేసుకున్నట్లు జేడీ వాన్స్ వివరించారు.
ప్రస్తుతం ఉషా వాన్స్ గర్భం దాల్చగా, త్వరలోనే వారి కుటుంబంలోకి నాలుగో సంతానంగా మగబిడ్డ రాబోతున్నట్లు జేడీ వాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. “మా నుంచి ఒక ప్రాణం కోల్పోయింది, కానీ దేవుడు మాకు మరొక ప్రాణాన్ని ప్రసాదించాడు” అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా, అమెరికా చరిత్రలోనే వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉంటూ సంతానాన్ని పొందుతున్న నాల్గవ ‘సెకండ్ ఫ్యామిలీ’గా వాన్స్ దంపతులు సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. దేశంలో జనాభా పెరగాలని, ఎక్కువ మంది పిల్లలు పుట్టాలనే తన వ్యక్తిగత వాదనను ఈ సందర్భంగా జేడీ వాన్స్ మరోసారి గుర్తుచేశారు.









