ఆగస్టు 1న ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని రాక సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
ఈ మెగా ఈవెంట్కు సంబంధించి పారిశుద్ధ్యం, ఇతర ప్రజా అవసరాల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం నలుగురు కీలక ఐఏఎస్ అధికారులకు అప్పగించింది. మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కేతన్ గార్గ్ (జీవీఎంసీ కమిషనర్), రాహుల్ మీనా (రాజమండ్రి మున్సిపల్ కమిషనర్), హెచ్ ఎం ధ్యాన చంద్ర (విజయవాడ మున్సిపల్ కమిషనర్), మరియు మయూర్ అశోక్ (గుంటూరు మున్సిపల్ కమిషనర్) ఈ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ఈ నలుగురు ఐఏఎస్ అధికారులకు సహాయకులుగా వ్యవహరించేందుకు వివిధ కార్పొరేషన్ల నుండి 26 మంది నాన్-కేడర్ అధికారులను కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. నియామకమైన అధికారులందరూ తక్షణమే విజయనగరం జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు విమానాశ్రయ పరిసరాల్లో సకల సదుపాయాలను యంత్రాంగం వేగంగా సిద్ధం చేస్తోంది.









