Nitrazepam Tablets: నైట్రాజెపామ్‌ అక్రమ విక్రయాల ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్‌

రంగారెడ్డి జిల్లాలో నైట్రాజెపామ్‌-10 ఎంజీ టాబ్లెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి 1,840 నైట్రాజెపామ్‌ టాబ్లెట్లు, మూడు సెల్‌ఫోన్లు, రూ.1,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 18న గార్స్‌ ఆసుపత్రి సమీపంలో మహ్మద్‌ అష్పాక్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 800 టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించడంతో మరో ఇద్దరు నిందితులు రామ్‌జానే, మహ్మద్‌ ఇమ్రాన్‌ పేర్లు వెలుగులోకి వచ్చాయి.

స్వాధీనం చేసుకున్న టాబ్లెట్ల విలువ సుమారు రూ.1.23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక్కో టాబ్లెట్‌ను రూ.20కి కొనుగోలు చేసి, రూ.50కి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ విక్రయాల ద్వారా నిందితులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సరఫరాదారులుగా రోహన్‌, కరణ్‌, నడే అజయ్‌లను గుర్తించినట్లు తెలిపారు.

ప్రధాన సరఫరాదారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ రాజేంద్రనగర్‌ జోన్‌, కామాటిపుర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. అక్రమంగా విక్రయిస్తున్న మత్తు మందుల సరఫరా గొలుసును గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు