రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లో తన సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 10 నగరాల్లోనూ ఉబర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. దీంతో దేశీయంగా ఉబర్ సేవలు అందిస్తున్న నగరాల సంఖ్య 225కు చేరింది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ విస్తరణలో భాగంగా కొత్తగా సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లోని ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. పరిమిత కాలం పాటు కొత్త ప్రయాణికులకు తమ మొదటి రైడ్ను ఉచితంగా అందించనున్నట్లు ఉబర్ తెలిపింది.
దేశంలోని మరిన్ని ప్రాంతాలకు సేవలను విస్తరించడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా అందించడమే లక్ష్యమని ఉబర్ ఇండియా డైరెక్టర్ రిషాంత్ ఘోష్ తెలిపారు. 225 నగరాల మార్కును దాటడం సంస్థ విస్తరణలో కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.









