బాలీవుడ్ నటి కృతి సనన్, ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివాతో కలిసి చేసిన రక్షాబంధన్ ప్రకటన తీవ్ర వివాదానికి దారితీసింది. పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్లో కృతి ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రక్షాబంధన్ వంటి సంప్రదాయ పండుగలో ఆమె ధరించిన బ్రాలెట్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గివా ఆ ప్రకటనను తొలగించింది.
ఈ వివాదంపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. రక్షాబంధన్ వంటి పవిత్రమైన పండుగను బికినీ తరహా దుస్తుల్లో జరుపుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ మరింత తీవ్రరూపం దాల్చింది. మరోవైపు యాడ్పై వస్తున్న విమర్శలకు కృతి సనన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
పండుగలు మనసులోని భావోద్వేగాలు, సంప్రదాయాలకు సంబంధించినవని కృతి పేర్కొంది. ఒక మహిళ ధరించే దుస్తుల నెక్లైన్ను బట్టి ఆమె సంస్కృతిని అంచనా వేయలేమని స్పష్టం చేసింది. “సంస్కృతీ సంప్రదాయాలు మనసులో ఉంటాయి తప్ప నెక్లైన్లో కాదు” అంటూ ఘాటుగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కృతి సనన్-గివా యాడ్ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.









