ఆపరేషన్ సిందూర్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఎస్-400 కీలక పాత్ర పోషించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా తెలిపారు. పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దుకు 200 కిలోమీటర్ల పరిధిలోకి కూడా రాలేకపోయాయని ఆయన వెల్లడించారు. ఎస్-400 వ్యవస్థలు ఎక్కడ మోహరించాయో తెలుసుకునేందుకు పాక్ గూఢచారులను, స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసిందన్నారు.
రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించి అడ్డుకోగల అత్యాధునిక రక్షణ వ్యవస్థ. ఆపరేషన్ సమయంలో వీటి స్థానాలను గుర్తించేందుకు పాకిస్థాన్ గూఢచారులతో పాటు ఇతర దేశాల శాటిలైట్ సహాయాన్ని కూడా తీసుకున్నట్లు మిశ్రా తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యానికి చర్యల విషయంలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని మిశ్రా పేర్కొన్నారు. పౌరులకు నష్టం కలగకుండా ఉగ్రవాదులు, వారి మద్దతుదారులనే లక్ష్యంగా చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మే 7న జైష్, లష్కర్కు చెందిన తొమ్మిది ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేసినట్లు వెల్లడించారు.









