భద్రాచలం (టౌన్), డిసెంబర్ 3:
వరల్డ్ డిజేబుల్ డే ను పురస్కరించుకొని భవిత ప్రత్యేక అవసరాల పాఠశాల వారి ఆహ్వానం మేరకు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ భద్రాచలం వి. శివనాయక్ చీఫ్ గెస్ట్ గా పాల్గొని న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజేబుల్ డే ను స్పెషల్ ఏబుల్ డే గా భావించడం సమాజంలో ఉన్న సానుకూల దృక్పథాన్ని మరింత బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల తల్లిదండ్రులకు వారికి ఉన్న చట్టపరమైన హక్కులు, అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై వివరించి అవగాహన కల్పించారు.
సాధారణ పిల్లలతో పోల్చితే స్పెషల్ ఏబుల్ పిల్లల అవసరాలు, బాధలు భిన్నంగా ఉంటాయని, తల్లిదండ్రులు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నారని, ఆయన ప్రశంసించారు. అలాగే డిజేబుల్ స్కూల్ టీచర్లు పిల్లలను ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటూ మంచి వాతావరణాన్ని కల్పించడం అభినందనీయమని ఆయన అన్నారు. పాఠశాల అభివృద్ధి, కొన్ని సదుపాయాల అవసరం ఉన్నట్టు తమ దృష్టికి వచ్చినట్లు, వాటిని నెరవేర్చేందుకు తాను ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రతి పిల్లల్లో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, అందువల్ల తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ తీసుకొని ఇలాంటి మంచి వాతావరణం ఉన్న పాఠశాలకు క్రమం తప్పకుండా పంపాలని సూచించారు.అనంతరం భద్రాచలం అడ్వకేట్ బార్ అసోసియేషన్ సభ్యులు తల్లిదండ్రులకు, టీచర్లకు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిల్లలకు నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న వారికి శివనాయక్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్లు అవులూరి సత్యనారాయణ, అంబేద్కర్, టి లలిత, సాధన పల్లి సతీష్, బండారు రమేష్, చల్లా శివకృష్ణ, మానస, పరిటాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.









