హైదరాబాద్ పాతబస్తీలో వందేమాతరం గీతంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. వందేమాతరం గేయాన్ని అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, పాతబస్తీలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద లక్షలాది మందితో కలిసి స్వయంగా వందేమాతరం ఆలాపన చేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఎంఐఎం పార్టీకి ఆయన సూటిగా సవాల్ విసిరారు.
చట్టానికి లోబడి జాతీయత గురించి మాట్లాడే తమపై మతతత్వవాదులనే ముద్ర వేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో చట్టాన్ని ఉల్లంఘించే వారిని సెక్యులరిస్టులుగా కీర్తిస్తున్నారని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి ఆలయాన్ని అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో అత్యంత వైభవంగా అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను ఏకం చేసిన జాతీయ గేయం చుట్టూ కొందరు వివాదాలు సృష్టించడం సరికాదని, జాతీయ భావాలను అవమానించే శక్తులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.









