సామాన్యుడి రోజువారీ ఆహారంలో కీలకమైన కోడిగుడ్డు ధరలు అమాంతం పెరిగిపోయి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కేవలం రూ.4 కే లభించిన కోడిగుడ్డు ధర.. ఇప్పుడు ఏకంగా రూ.7 కు చేరుకుంది. అయితే, విచిత్రంగా కోడిగుడ్డు ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో చికెన్ ధరలు మాత్రం గణనీయంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఈ ఆకస్మిక ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలు కూడా ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్చిలో ఎగుమతులు నిలిచిపోయి ధరలు కొద్దిగా తగ్గినా.. ఇప్పుడు సరఫరా మార్గాల్లో వచ్చిన మార్పుల వల్ల మళ్లీ రేట్లు పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడుతోంది. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడుతుండటంతో గుడ్ల ఉత్పత్తి (Production) గణనీయంగా పడిపోయిందని పౌల్ట్రీ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడం వల్లే కోడిగుడ్డు ధరలు ఈ స్థాయిలో మండిపోతున్నాయి.









