అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజంగా, డీ-కంపెనీ డ్రగ్స్ సామ్రాజ్యానికి కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న సలీం డోలాను భారత నిఘా సంస్థలు విజయవంతంగా పట్టుకున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్లో వ్యూహాత్మకంగా మాటువేసి అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి తీసుకువచ్చారు.
సలీం డోలా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 5,000 కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దావూద్ ఇబ్రహీం ఆర్థిక మూలాలను బలపరచడంలో, ముఖ్యంగా డ్రగ్స్ మరియు హవాలా డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించడంలో ఇతను అత్యంత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
ఢిల్లీ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ సలీం డోలాను రహస్య ప్రాంతానికి తరలించి అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ విచారణలో దావూద్ ప్రస్తుత ఆచూకీ, పాకిస్థాన్లోని అండర్ వరల్డ్ స్థావరాలు, భారత్లోని స్లీపర్ సెల్స్ గురించిన కీలక సమాచారం రాబట్టనున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) లేదా ముంబై పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.









