పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ చట్టం అమలుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పార్లమెంటులో దీనిని ప్రవేశపెట్టేందుకు తాము ఎంతో కృషి చేశామని ఆయన వెల్లడించారు.
ప్రతిపక్ష పార్టీల నీచ రాజకీయాల వల్లే నాలుగు దశాబ్దాలుగా ఈ చట్టం అమల్లోకి రాకుండా ఆగిపోయిందని మోదీ విమర్శించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం, చట్టసభలకు (అసెంబ్లీ, పార్లమెంటు) ప్రాతినిధ్యం వహించడం ఆయా పార్టీలకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఈ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే కాకుండా, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు ఇప్పుడు సాకులు వెతుకుతున్నాయని ఆయన మండిపడ్డారు.
లోక్సభ, శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడమనే ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించడానికి తాము సిద్ధమవుతున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, సాధారణ మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం మహిళలు కేవలం ఇంటికే, కుటుంబ బాధ్యతలకే పరిమితం కావాలని కోరుకుంటున్నాయని ఆయన విమర్శించారు.









