లాయర్ అవతారమెత్తిన మమతా బెనర్జీ: మాజీ సీఎం న్యాయవాద హోదాపై ఆరా తీసిన భారత బార్ కౌన్సిల్

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కలకత్తా హైకోర్టులో న్యాయవాది దుస్తులు ధరించి ప్రత్యక్షమవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)లో ఆమె స్వయంగా వాదనలు వినిపించారు. తన ట్రేడ్‌మార్క్ తెల్ల చీరపై నల్లకోటు ధరించి కోర్టుకు హాజరైన ఆమె, మహిళలు మరియు మైనారిటీల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆమె న్యాయవాద హోదాపై భారత బార్ కౌన్సిల్ (BCI) స్పందిస్తూ, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న కాలంలో (2011-2026) ఆమె తన న్యాయవాద వృత్తిని నిలిపివేశారా లేదా అనే అంశంపై బీసీఐ ఆరా తీస్తోంది. మమత ఎన్‌రోల్‌మెంట్ నంబర్, నమోదు చేసుకున్న తేదీ, మరియు ఆమె తన సభ్యత్వాన్ని ఎప్పుడు పునరుద్ధరించుకున్నారు వంటి వివరాలను రెండు రోజుల్లోగా అందజేయాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు వృత్తిపరమైన ప్రాక్టీస్‌ను కొనసాగించకూడదు కాబట్టి, ఆమె న్యాయవాదిగా కోర్టుకు హాజరైన విధానాన్ని బీసీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తాను 1995లోనే న్యాయవాదిగా నమోదు చేసుకున్నానని మమత కోర్టుకు వివరించారు.

ఈ పరిణామంపై పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యంగ్యంగా స్పందించారు. తనకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయని, ఇలాంటి అనవసర విషయాల గురించి ఆలోచించే సమయం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఓటమి పాలైన మమత, ఇప్పుడు న్యాయస్థానంలో తన వాణిని వినిపించే ప్రయత్నం చేయడం రాజకీయ మరియు న్యాయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు