తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన హస్తినకు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మే మూడో వారం లేదా చివరి వారంలో రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటన ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కేంద్రంతో నిరంతరం నడిచిన రాజకీయ రగడ, నిధుల నిలిపివేత వంటి వివాదాల నేపథ్యంలో.. కొత్త సీఎం విజయ్ కేంద్ర ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరిని అవలంబిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ అత్యంత కీలకమైన భేటీలు జరపనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతో పాటు కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీని ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ప్రధాని మోదీతో జరిగే అధికారిక సమావేశంలో తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు, నిధుల విడుదల, ఇతర కీలక అభివృద్ధి అంశాలను విజయ్ ప్రస్తావించే అవకాశం ఉంది. వీటితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో కూడా విజయ్ సమావేశం కానున్నారు. వీరిద్దరి అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారైనట్లు విజయ్ సోషల్ మీడియా టీమ్ అధికారికంగా ధృవీకరించింది.
సైద్ధాంతికంగా అంతర్గతంగా బీజేపీని శత్రువుగా భావిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో సత్సంబంధాలు నెరపడం విజయ్కు అత్యంత అవసరంగా మారింది. ముఖ్యంగా తమిళనాడులో మార్పు కోరుకుంటూ టీవీకే (TVK) పార్టీకి భారీగా ఓట్లేసిన యువత, తొలిసారి ఓటర్ల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చాలంటే కేంద్ర నిధుల మద్దతు తప్పనిసరి. గతంలో స్టాలిన్ ప్రభుత్వానికి, మోదీ సర్కారుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న పరిస్థితులను విజయ్ తన చాకచక్యంతో మార్చగలుగుతారా లేదా అనేది ఈ పర్యటనతో తేలిపోనుంది. అమిత్ షాతో జరగబోయే భేటీ తమిళనాడు భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.









