తెలంగాణలో తన పర్యటనలను, జనసేన ఉనికిని అడ్డుకుంటామని కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఏ చిన్న వివాదం వచ్చినా సరే కావాలనే ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఉపాధి సమస్యలు లేదా ఉద్యమకారుల సంక్షేమం గురించి మాట్లాడకుండా.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని, ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు నోరు విప్పలేదని పవన్ నిలదీశారు.
ప్రజా గాయకుడు, దివంగత గద్దర్తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసుకున్నారు. ‘బండి వెనుక బండి కట్టి’ అంటూ ప్రజలను చైతన్యపరిచిన గద్దరన్న బతికున్నప్పుడు ఇప్పుడున్న నాయకులంతా ఎక్కడ దాక్కున్నారని, ఆయనకు ఏం సహాయం చేశారని ప్రశ్నించారు. తన వెన్నులో బుల్లెట్లు ఉండటం వల్ల నడవలేకపోతున్నానని, ఒక వాహనం కొనివ్వమని గద్దర్ అడిగిన 3-4 రోజుల్లోనే తాను సొంతంగా కారు కొనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తనతో ఎంతో ఆత్మీయంగా ఉంటూ, ఎన్నో విషయాలు చర్చించిన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి లాంటి వాళ్లు కూడా ఇప్పుడు తనను తెలంగాణలోకి రానివ్వబోమని మాట్లాడటం తీవ్రంగా బాధించిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతిదానికీ ఆంధ్రావాళ్లనే తిడుతూ కూర్చుంటే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇక్కడ ఇతర ప్రాంతాల వ్యాపారులు, కాంట్రాక్టర్లు హాయిగా వ్యాపారాలు చేసుకుంటుంటే, ప్రజా పక్షాన నిలబడే జనసేన లాంటి పార్టీలను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అసలు కాంగ్రెస్ జాతీయ పార్టీనా లేక ప్రాంతీయ పార్టీనా అనేది రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై తనకున్న ప్రేమ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, అది తన గుండెల్లో ఉందని.. అందుకే తెలంగాణ ప్రజల నుండి తనను ఎవరూ దూరం చేయలేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.









