తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) తమ ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ను తప్పనిసరిగా జతచేయాలని (లింక్ చేసుకోవాలని) ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ‘ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ’ (ఎస్ఐఆర్) ప్రక్రియ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మొబైల్ నంబర్ లింక్ లేకపోతే, ఎన్నారైలు ఆన్లైన్లో తమ వివరాలను సమర్పించడానికి అర్హులు కాదని, ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు వెల్లడించారు.
ఎన్నారైలు తమ మొబైల్ నంబర్ను లింక్ చేయడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారిక పోర్టల్ voters.eci.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న ‘ఫారం 8’ (ప్రస్తుత ఓటర్ల జాబితాలో వివరాల సవరణ)ను పూర్తి చేసి, మొబైల్ నంబర్ నమోదు చేశాక వచ్చే ఓటీపీ (OTP) ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనితో పాటు ఓటర్ ఐడీ కార్డులో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలా ఉండటం తప్పనిసరి అని, ఫారం సమర్పించే సమయంలో ఆధార్ అథెంటికేషన్ అవసరమని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 15 నుంచి 24 వరకు ఓటర్ల జాబితా రూపకల్పన, జూన్ 25 నుంచి జూలై 24 వరకు క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది. అభ్యంతరాలను ఆగస్టు 30 వరకు స్వీకరించి, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ ఓటు హక్కును కాపాడుకోవాలనుకునే ఎన్నారైలు, నిర్ణీత గడువులోగా ఈ వివరాలను అప్డేట్ చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములుగా కొనసాగవచ్చని అధికారులు సూచించారు.









