భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జూన్ 20
టుడే 9 ప్రతినిధి
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు వారికి ఇష్టమైన కళలు క్రీడల పట్ల మక్కువ కలిగించి వారిలో దాగివున్న ప్రతిభా నైపుణ్యాలను ఇప్పటి నుండే వెలికి తీయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శనివారం నాడు దుమ్ముగూడెం మండలంలోని ఆర్లగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల పరిసరాలు తరగతి గదులు లైబ్రరీ రూము, డైనింగ్ హాల్ ,విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పిల్లలకు సరఫరా చేసే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్ అలాగే మండలంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం ఎలా జరుగుతుందో ఫోన్లో వీడియో ద్వారా ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులకు తమ గ్రామాలకు వెళ్లి తిరిగి పాఠశాలకు వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు వాతావరణం మార్పు వలన అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా విద్యార్థుల యొక్క మానసిక స్థితిగతులను హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు గమనించి వారికి సకాలంలో వైద్యం చేయించాలని అన్నారు. వర్షాకాలం నడుస్తున్నందున విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, విషపూరితమైన క్రిమి కీటకాలు సంచరిస్తూ ఉంటాయని కనుక రాత్రిపూట విద్యార్థులు ఎవరు బయటకు రాకుండా చూడాలని, ప్రతిరోజు వంటగది శుభ్రం చేసి మెనూ ప్రకారము విద్యార్థులకు వేడిగా ఉన్న ఆహారాన్ని వడ్డించాలని అన్నారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండేలా చూడాలని, పాఠశాల చుట్టూ వర్షపు నీరు నిలవకుండా సైడ్ డ్రైన్లు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
అనంతరం చిన్న ఆర్లగూడెం కొంగ వాగు గుంపు జిపిఎస్ పాఠశాలలను పరిశీలించి పిల్లల చేత ఉద్దీపకం వరకు బుక్ లోని అంశాలను చదివించి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ సంవత్సరం ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు మార్పులు చేర్పులు చేయడం జరిగిందని, సంబంధిత ఉపాధ్యాయులు ఉద్దీపకం వర్క్ బుక్ లోని పదాలను పిల్లల చేత బోర్డుపై వ్రాయించి వాటి అర్థాలను వారి చేత చెప్పించాలని అలాగే ప్రతిరోజు బోధించే పాఠ్యాంశాలతో పాటు అదనంగా విద్యార్థులకు వారికి ఇష్టమైన వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయానికి సంబంధించిన కలల పట్ల అవగాహన కలిగించాలని ఉపాధ్యాయులకు సూచిస్తూ వీటితోపాటు క్రీడలపై కూడా మక్కువ కలిగించాలని అన్నారు. సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడి దానికి సంబంధించిన మెలకువలు చిన్నారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సోమశేఖర్, వార్డెన్ లక్ష్మణరావు, ఎస్సీ ఆర్ పి విటల్, జిపిఎస్ పాఠశాల హెచ్ఎంలు పాపారావు, కన్నారావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు









