ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును పరమావధిగా చేసుకుని పనిచేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. విద్యా రంగంలో మోదీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందని, దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, గిరిజన విశ్వవిద్యాలయాలను నెలకొల్పడంతో పాటు మెడికల్ సీట్లను భారీగా పెంచిందని వివరించారు. గత ప్రభుత్వాల హయాంతో పోలిస్తే తమ పాలనలోనే విద్యా పేపర్ లీకేజీలు గణనీయంగా తగ్గాయని, నీట్ వ్యవహారంలో సమస్య వెలుగుచూడగానే కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.
నీట్ వివాదాన్ని సాకుగా చూపి కొందరు విపక్ష నేతలు ఢిల్లీ వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు. నీట్ సాకుతో ప్రధానితో పాటు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నటుడు ప్రకాశ్ రాజ్ సహా కొందరు విద్రోహకర, దేశ వ్యతిరేక వ్యాఖ్యలకు పాల్పడటం దారుణమన్నారు. కొన్ని విద్యా సంఘాలు విద్యార్థుల ప్రయోజనాలను పక్కనబెట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించిన ఆయన, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తమ సొంత పాలనలో జరిగిన పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో మాట్లాడాలని సవాల్ విసిరారు.









