జమ్మూకశ్మీర్ అంశంపై అమెరికా నుంచి కీలక వ్యాఖ్య వెలువడింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అనంతరం జమ్మూకశ్మీర్ భారత్లో ఒక ముఖ్యమైన భాగమని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమెరికా రాయబారి శ్రీనగర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్, అమెరికా మధ్య సంబంధాలను మరింత విస్తరించే అవకాశాలపై చర్చ జరిగినట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే జమ్మూకశ్మీర్కు సంబంధించిన అంతర్గత సమస్యల పరిష్కారంలో అమెరికా పాత్ర లేదని, వాటిని న్యూఢిల్లీనే పరిష్కరించాల్సి ఉంటుందని ఒమర్ అబ్దుల్లా గతంలో స్పష్టం చేశారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా సెర్గియో గోర్ జమ్మూకశ్మీర్తో పాటు లద్దాఖ్లోనూ పర్యటించనున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్కు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న అమెరికా ప్రయాణ హెచ్చరికను సమీక్షించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం, పౌర అశాంతి వంటి కారణాలతో అమెరికా తన పౌరులకు జమ్మూకశ్మీర్ పర్యటనపై హెచ్చరికలు జారీ చేస్తోంది.









