భారత జాతీయ గీతం ‘జన గణ మన’పై బ్రిటిష్ గాయని లారా రైట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025లో ఇంగ్లండ్తో జరిగిన భారత్ టెస్టు సిరీస్ సందర్భంగా ఆమె భారత జాతీయ గీతాన్ని బెంగాలీ భాషలో ఆలపించారు. అయితే తొలిసారి ‘జన గణ మన’ పాడే సమయంలో తన జీవితంలోనే అత్యంత టెన్షన్కు గురైన సందర్భాల్లో అదొకటని లారా రైట్ గుర్తుచేసుకున్నారు.
క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునే సమయంలో ఇటాలియన్, జర్మన్ వంటి భాషలపై కొంత అవగాహన ఏర్పడుతుందని, కానీ జాతీయ గీతాలు ఆలపించేటప్పుడు వివిధ భాషల్లోని పదాలను నేర్చుకోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. ముఖ్యంగా భారత జాతీయ గీతంలోని పదాలను సరైన ఉచ్చారణతో పాడటం తనకు పెద్ద సవాలుగా అనిపించిందని పేర్కొన్నారు. అందుకే గీతాన్ని పాడే ముందు ప్రత్యేకంగా సమయం కేటాయించినట్లు చెప్పారు.
‘జన గణ మన’ను సరిగ్గా ఆలపించేందుకు ఆ గీతాన్ని అనేకసార్లు విన్నానని లారా రైట్ తెలిపారు. బెంగాలీ భాష తెలిసిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులతో కలిసి పదాల ఉచ్చారణ, ఎక్కడ పదాలను విభజించాలి, ప్రతి పదానికి ఉన్న అర్థం ఏమిటి అనే విషయాలను తెలుసుకున్నానని చెప్పారు. ప్రేక్షకులకు కనిపించని ఈ కృషి తన కెరీర్లో ఎంతో ముఖ్యమైనదని లారా రైట్ పేర్కొన్నారు.









