మాజీ మంత్రి కారుమూరి నివాసంలో సిట్ సోదాలు: 4 గంటల పాటు విచారణ.. కుమారుడికి నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాసంలో శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి చేరుకున్న సిట్ బృందం, సుమారు నాలుగు గంటల పాటు సోదాలు చేపట్టి మాజీ మంత్రి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టులు, టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.

మద్యం రవాణాలో జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 200 నుంచి రూ. 250 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. అంతకుముందు అనారోగ్య కారణాల రీత్యా కారుమూరి విచారణకు హాజరుకాకపోవడంతో, సిట్ అధికారులు నేరుగా ఆయన నివాసానికే వచ్చి విచారించారు. మాజీ మంత్రి వయస్సును పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం ఆయన కోరిన చోటే వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

సోదాల అనంతరం మాజీ మంత్రి కుమారుడు కారుమూరి సునీల్‌కు సిట్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. విచారణకు కారుమూరి నాగేశ్వరరావు సహకరించారని, అవసరమైతే మరోసారి పిలుస్తామని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు