తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ సోమవారం (ఏప్రిల్ 27న) శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించగా, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరై వారికి అభినందనలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతామని ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.
ఈ ప్రమాణస్వీకారం ముఖ్యంగా మంత్రి అజారుద్దీన్కు రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చింది. సభలో సభ్యత్వం లేకుండానే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, నిబంధనల ప్రకారం ఆరు నెలల గడువు ముగిసేలోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టు నుండి రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న ఈ ఎమ్మెల్సీ ఫైల్పై గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఎట్టకేలకు సంతకం చేయడంతో, అజారుద్దీన్ తన మంత్రి పదవికి ఎదురైన సాంకేతిక ఇబ్బందుల నుంచి గట్టెక్కారు.
ప్రమాణస్వీకారం అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి మరియు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధి కోసం తాను మరింత నిబద్ధతతో కృషి చేస్తానని పేర్కొన్నారు. అటు ప్రొఫెసర్ కోదండరాం కూడా తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజా సేవలో ముందుంటానని వెల్లడించారు.









