భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) కౌన్సిల్లో పూర్తిస్థాయి ఓటింగ్ హక్కులు కలిగిన సభ్యురాలిగా ఆమె నియమితులయ్యారు. క్రీడలో చురుకైన ప్లేయర్గా కొనసాగుతూనే, ప్రపంచ పాలకమండలిలో ఇలాంటి ఉన్నత స్థాయి నిర్ణయాధికార పదవిని చేపట్టడం క్రీడా రంగంలోనే చాలా అరుదైన విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ ఛైర్పర్సన్గా ఎన్నిక కావడంతో సింధుకు ఈ అవకాశం దక్కింది. 2026 నుంచి 2029 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. హార్సెన్స్లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె తొలిసారిగా పాల్గొన్నారు. 2017 నుంచి అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా, 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ ఇంటిగ్రిటీ అంబాసిడర్గా ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ఉన్నత బాధ్యతలు లభించాయి.
ఈ నియామకంపై సింధు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల గొంతుకను వినిపించే అవకాశం రావడం తనకి గర్వంగా ఉందని తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ ఖున్యింగ్ పటామ లీస్వాడ్ట్రాకుల్ సింధు నియామకాన్ని స్వాగతిస్తూ, క్రీడాకారుల అనుభవాలను నేరుగా పాలకమండలి నిర్ణయాల్లో చేర్చడానికి సింధు ప్రతినిధిగా ఉండటం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సింధు రాకతో క్రీడ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.









