హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం: ప్రొఫెసర్ దంపతులకు మత్తుమందు ఇచ్చి భారీ దోపిడీ

హైదరాబాద్ నగరం జవహర్ నగర్ పరిధిలో నేపాలీ ముఠా మరోసారి రెచ్చిపోయింది. కౌకూరులోని గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ప్రొఫెసర్ విజయలక్ష్మి, మురళీ మోహన్ దంపతుల ఇంట్లో పనివాళ్లే పథకం ప్రకారం భారీ దోపిడీకి పాల్పడ్డారు. కేవలం 13 రోజుల క్రితమే పనిలో చేరిన నేపాలీ దంపతులు, తమ స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు నగదును దోచుకెళ్లిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సోమవారం రాత్రి పనిమనిషి పుట్టినరోజు అంటూ నిందితులు ఒక డ్రామా ఆడారు. కేక్ కటింగ్ నెపంతో తన స్నేహితులని మరో ఐదుగురిని ఇంటికి పిలిపించి, భోజనం చేస్తున్న ప్రొఫెసర్ దంపతులపై ఒక్కసారిగా దాడి చేశారు. బాధితులను తాళ్లతో కట్టేసి, మత్తుమందు ఇచ్చి ఒక గదిలో బంధించారు. ప్రాధేయపడినా వినకుండా ఇంట్లోని విలువైన వస్తువులన్నీ లూటీ చేశారు. వెళ్లేటప్పుడు సాక్ష్యాలు దొరక్కుండా సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడం గమనార్హం.

మంగళవారం మధ్యాహ్నం స్పృహలోకి వచ్చిన దంపతులు కిటికీ నుంచి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజ్‌గిరి డీసీపీ సుమతి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పని మనుషులను పెట్టుకునేటప్పుడు సరైన గుర్తింపు కార్డులు తీసుకోకపోవడం, పోలీసు వెరిఫికేషన్ చేయించకపోవడం వల్ల ఇలాంటి ముఠాలు సులువుగా మోసాలకు పాల్పడుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు