పశ్చిమాసియాలో ఇరాన్ ప్రతిఘటనను అడ్డుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ రక్షణలో అత్యంత కీలకమైన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఒక భారీ రివార్డును ప్రకటించింది. ఐఆర్జీసీకి నిధులు సమకూరుస్తున్న ఆర్థిక మూలాలు, బినామీ సంస్థలు లేదా వ్యక్తుల గురించిన ఖచ్చితమైన సమాచారం అందిస్తే 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 145 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ బంపరాఫర్ ఇచ్చింది.
ఈ భారీ రివార్డు వెనుక ఇరాన్ను ఆర్థికంగా ఏకాకిని చేయాలనే బలమైన వ్యూహం దాగి ఉంది. ఐఆర్జీసీ తన నిధులను ప్రాంతీయ అస్థిరతకు, ఉగ్రవాద కార్యకలాపాలకు మరియు అణు కార్యక్రమాలకు ఉపయోగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్పటికే చమురు విక్రయాల ద్వారా నిధులు సమకూర్చుకుంటున్న నెట్వర్క్పై, ముఖ్యంగా ‘షాహిద్ పుర్జాఫరీ ఆయిల్ హెడ్క్వార్టర్స్’కు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. చమురు లావాదేవీలను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ అనుకూల ప్రాక్సీ గ్రూపులకు అందే ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది.
మరోవైపు, అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. యుద్ధం ముగింపునకు చర్చలు ఒక మార్గమని భావిస్తున్నప్పటికీ, ఎటువంటి దురాక్రమణనైనా ఎదుర్కోవడానికి తమ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడం, కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా ఇరు దేశాల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. అమెరికా ప్రకటించిన ఈ ‘రివార్డ్ ప్లాన్’ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.









