భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడులలో ఒకటైన 2019 పుల్వామా దాడి నిందితులకు కాలం చెల్లుతోంది. ఆ దారుణ ఊచకోత వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులలో ఒకడు, భారత భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న టాప్ ఉగ్రవాది హంజా బుర్హాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో హతమయ్యాడు. పీఓకేలోని ముజఫరాబాద్లో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన ఆకస్మిక కాల్పుల దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నిఘా వర్గాల ద్వారా నమ్మకమైన సమాచారం అందుతోంది.
హంజా బుర్హాన్ పాకిస్తాన్ కేంద్రంగా భారత్పై విషం చిమ్మే నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) లో అత్యంత కీలకమైన కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. కాశ్మీర్ లోపల మరియు భారతదేశంలోని పలు నగరాల్లో అనేక ఉగ్రదాడులకు వ్యూహాలు రచించిన ఇతడు, గత ఐదేళ్లుగా భారత ఏజెన్సీల కంటిమీద కునుకు లేకుండా చేశాడు. పాకిస్తాన్ సైన్యం, అక్కడి గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) లీగల్ మరియు ఇల్లీగల్ రక్షణ వలయంలో ఉంటూ.. భారత్కు వ్యతిరేకంగా పీఓకే సరిహద్దుల్లో కొత్తగా చేరిన ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకంపై వ్యూహాత్మక శిక్షణ ఇవ్వడంలో ఇతడు తెరవెనుక కీలక పాత్ర పోషించేవాడు.
భారతదేశంలో అమాయక ప్రజల, జవాన్ల రక్తం చిందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని గత కొంతకాలంగా పాకిస్తాన్, పీఓకే సరిహద్దు దేశాలలో వరుస హత్యలు జరుగుతుండటం గమనార్హం. ఆయా దేశాలలో ఆశ్రయం పొందుతున్న కరుడుగట్టిన ఉగ్రవాదులు ఇలా ఒకరి తర్వాత ఒకరు ‘గుర్తుతెలియని వ్యక్తుల’ (Unknown Men) చేతిలో అంతమవ్వడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హంజా బుర్హాన్ హత్య కూడా ఈ రహస్య వరుస ఆపరేషన్లలో భాగమేనని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ తాజా పరిణామంతో పాక్లో మరియు పీఓకే లాంచ్ప్యాడ్లలో తలదాచుకుంటున్న మిగిలిన ఉగ్రనేతల్లో వణుకు మొదలైంది.









