తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె, జనసేన పార్టీ నేత క్రాంతి ప్రశంసల వర్షం కురిపించారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సరికొత్త, ఆరోగ్యకరమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షాల విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని, నిన్నగాక మొన్న ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇంటికి స్వయంగా వెళ్లి గౌరవించిన విధానం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
తమిళనాడులో పరిస్థితులు సానుకూలంగా మారుతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా శత్రుత్వ రాజకీయాలు నడుస్తున్నాయని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలను గౌరవించేవారని, కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఇక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని విమర్శించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యాఖ్యలు చేస్తూ, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును దారుణంగా అవమానించారని గుర్తు చేశారు. ఆ అవమాన భారంతోనే చంద్రబాబు నాటి కౌరవ సభను వీడి, మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి, దానిని నెరవేర్చుకున్నారని వివరించారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టడంపై క్రాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకపక్క ప్రజాప్రతినిధిగా జీతాలు తీసుకుంటూ కూడా సభకు వెళ్లకపోవడం దారుణమన్నారు. జగన్కు అసలు ఏ అవమానం జరిగిందని అసెంబ్లీని బహిష్కరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. జగన్ ఎప్పుడూ కాపులను రెచ్చగొట్టడం, పవన్ కళ్యాణ్ను కూటమి నుంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలనే కుటిల రాజకీయాలు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ ఇలాంటి రాజకీయాలు పక్కనబెట్టి, అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మరింత పరాభవం తప్పదని క్రాంతి హెచ్చరించారు.









