మెగా డీఎస్సీపై జగన్ తీవ్ర విమర్శలు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీనా లేక నిరుద్యోగులను ముంచిన ‘దగా డీఎస్సీనా’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా నిలదీశారు. తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసి, కావాలనే కాలయాపన చేస్తూ కొత్త నోటిఫికేషన్తో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. తీరా చూస్తే పేపర్లు లీక్ చేసి, డేటా డిలీట్ చేసి, మెరిట్ లిస్టులను మాయం చేస్తూ అభ్యర్థులకు పెద్ద ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఈ లీకులపై సీబీఐ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జగన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ధ్వజమెత్తారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగి టాపర్ కావడంపై అనుమానాలు:
పరీక్ష నిర్వహణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న ఒక ఎస్ సీఈఆర్టీ (SCERT) అవుట్సోర్సింగ్ ఉద్యోగికి డీఎస్సీలో మొదటి ర్యాంకు ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఆ అనుమానాస్పద ఫలితం వెలుగుచూసిన వెంటనే సదరు వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారో, టాపర్ వివరాలను మరియు మెరిట్ లిస్టులను వెబ్సైట్ నుంచి ఎందుకు దాచారో స్పష్టం చేయాలన్నారు. కేవలం ఎంపికైన వారికి మాత్రమే నేరుగా మొబైల్ మెసేజ్లు పంపి, జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో అధికారిక సెలక్షన్ లిస్టులను ప్రదర్శించకపోవడం వెనుక పెద్ద మతలబు ఉందని ఆరోపించారు.
స్పోర్ట్స్ కోటా పోస్టుల వేలంపాట – కన్వీనర్ మార్పుపై ప్రశ్నలు:
డీఎస్సీలో ‘స్పోర్ట్స్ కోటా’ కింద ఉన్న పోస్టులను ఒక్కొక్కటి రూ. 15 లక్షలకు అధికార పార్టీ నాయకుడే ఇంటికి పిలిచి బేరసారాలు సాగించారని జగన్ సంచలన ఆరోపణ చేశారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకున్నారని, ఇది రిక్రూట్మెంటా లేక వేలం పాటా అని మండిపడ్డారు. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్గా ఉన్నప్పటికీ… ఉన్నపళంగా ఆయన్ను తొలగించి జాయింట్ డైరెక్టర్ను కన్వీనర్గా ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే లోకేష్ను పదవి నుంచి తప్పించి, సీబీఐ దర్యాప్తు కోరి ప్రతిభ గల నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని జగన్ డిమాండ్ చేశారు.









