పవన్ కల్యాణ్తో జీవితాశయం:
నటుడిగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ తన చిరకాల కోరికను, జీవితాశయాన్ని బయటపెట్టారు. తన ఆరాధ్య దైవం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో యావత్ ప్రపంచంలోని తెలుగువారంతా ఉలిక్కిపడేలా ఒక మైండ్ బ్లోయింగ్ భారీ చిత్రాన్ని నిర్మించాలని.. ఆ ఒక్క సినిమా తర్వాత తన ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ను శాశ్వతంగా మూసివేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ‘రాజా రవీంద్ర టాక్స్’ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పవన్ కల్యాణ్ను మరోసారి ‘పవనేశ్వరా’, ‘దేవరా’ అంటూ దేవుడిలా ఆరాధిస్తూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై ముచ్చట:
ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని అడగ్గా.. ఆ అదృష్ట దినం కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని బండ్ల గణేష్ తెలిపారు. ఏడుకొండలవాడు ఆ రోజు ఎప్పుడు ఇస్తాడో చూడాలని, ఆయనతో ఏదో ఊరికే రొటీన్ సినిమా తీస్తే ఉపయోగం లేదన్నారు. ‘గబ్బర్ సింగ్’ వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా మాట్లాడుకున్నట్టే, చిరంజీవితో తీసే సినిమా కూడా 30 ఏళ్ల తర్వాత తన పిల్లలు గర్వంగా చెప్పుకునేలా ఒక హిస్టారికల్ బ్లాక్బస్టర్ కథతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితులపై ఆందోళన:
మరోవైపు, ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉందని బండ్ల గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మంచి కథలు దొరకడం లేదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో సినిమా భవిష్యత్తుపై భయం కలుగుతోందని విశ్లేషించారు. సినిమాకు మంచి టాక్ వచ్చినా థియేటర్లలో వసూళ్లు రావడం లేదని, ఒక ఎగ్జిబిటర్గా (థియేటర్ ఓనర్గా) తనకు ఘోరమైన అనుభవం ఎదురైందని, థియేటర్లపై ఒక్క రూపాయి కూడా రావడం లేదని ఆవేదన చెందారు. అందుకే, ఇటీవలే ‘బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్’ అనే పేరుతో కొత్త బ్యానర్ స్థాపించి, ఓటీటీ (ETV Win) భాగస్వామ్యంతో రూ. 4-5 కోట్ల చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు.









