బంగ్లాదేశ్ దౌత్య వ్యూహంలో మార్పు:
మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనా కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అద్భుతంగా సాగాయి. అయితే, ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మొహమ్మద్ యూనస్ హయాంలో చైనా, పాక్లతో సాన్నిహిత్యం పెరిగింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధికారంలోకి వచ్చాక భారత్తో బంధం మెరుగుపడుతుందని భావించినప్పటికీ, ప్రస్తుత పాలకుల ధోరణి కూడా పాకిస్థాన్ వైపునకే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి.
భారత్ను పక్కనబెట్టి పాక్లో అధికారుల శిక్షణ:
ఇరు దేశాల మధ్య మారుతున్న బంధాలకు నిదర్శనంగా బంగ్లాదేశ్కు చెందిన 12 మంది సీనియర్ సివిల్ సర్వెంట్లు (ఒక అడిషనల్ సెక్రటరీ, 11 మంది జాయింట్ సెక్రటరీలు) మిడ్ కెరీర్ ట్రైనింగ్ కోసం తొలిసారి పాకిస్థాన్ వెళ్లడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లాహోర్లోని సివిల్ సర్వెంట్ అకాడమీలో మే 4 నుంచి 21వ తేదీ వరకు జరిగిన ఈ శిక్షణ ఖర్చు మొత్తాన్ని పాకిస్థానే భరించింది. వాస్తవానికి, 2024 లో షేక్ హసీనా పదవి కోల్పోయేంతవరకు బంగ్లాదేశ్ అధికారులు భారత్లోని ముస్సోరీ (LBSNAA) అకాడమీతో పాటు వివిధ సంస్థల్లో శిక్షణ పొందేవారు. గత ఐదేళ్లలోనే దాదాపు 2500 మందికి పైగా బంగ్లా అధికారులు భారత్లో శిక్షణ పొందగా, హసీనా తప్పుకున్నాక ఆ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది.
భారత్కు లభించని తొలి ప్రాధాన్యత:
1971లో పాకిస్థాన్తో రక్తాంతక యుద్ధం చేసి, భారత్ సహాయంతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్.. ఇన్నాళ్లూ ఇస్లామాబాద్ పట్ల తీవ్ర వ్యతిరేకతను కనబర్చేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఢాకా-కరాచీ మధ్య నేరుగా విమాన రాకపోకలు ప్రారంభమవడం, పాక్ ఉన్నతాధికారులు బంగ్లాలో పర్యటించడం ఇరు దేశాల సత్సంబంధాలకు అద్దం పడుతున్నాయి. అంతేకాకుండా, పాకిస్థాన్-చైనా సంయుక్తంగా తయారు చేసిన ‘జేఎఫ్-17’ (JF-17) ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి కూడా బంగ్లాదేశ్ ఆసక్తి కనబరుస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా “ఇకపై తమకు భారత్ తొలి ప్రాధాన్యం కాదనే” బలమైన సంకేతాలను ఇస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై భారత్ విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.









