రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ కారణంగా నిరాశ్రయులైన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె. కవిత తెలంగాణ గవర్నర్ను ఆశ్రయించారు. మంగళవారం ఆమె ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్తో పాటు పలువురు బాధితులతో కలిసి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను లోక్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం, పరిగి, ఆర్ఆర్ఆర్ (RRR) పరిధిలోని భూసేకరణ బాధితుల సమస్యలను గవర్నర్కు క్షుణ్ణంగా వివరించి, ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులందరికీ వెంటనే ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు కేటాయించాలని, వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం జారీ చేసిన భూసేకరణ నోటీసును తక్షణమే రద్దు చేయాలని కవిత గవర్నర్ను కోరారు. వీటితో పాటు రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్పు వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇతర భూసేకరణ ఇబ్బందులను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
గవర్నర్తో భేటీ అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేద మహిళల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని, రేవంత్ రెడ్డి ఒక నిర్దయుడైన ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. తమ నిరంతర పోరాటాల ఫలితంగానే వెలుగుమట్ల బాధితులకు అదే స్థలంలో భూమి కేటాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, పరిగి, ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియలను తాత్కాలికంగా నిలిపివేసిందని తెలిపారు. ఇవి పాక్షిక విజయాలు మాత్రమేనని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరగాలంటే కేంద్రం ప్రమేయం అవసరమని, అందుకే గవర్నర్ను కలిశామన్నారు. గవర్నర్ ఈ అంశాలపై సానుకూలంగా స్పందించి నివేదిక తెప్పించుకుంటామని హామీ ఇచ్చారని, ఒకవేళ బాధితులకు న్యాయం జరగకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కవిత హెచ్చరించారు.









