ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య రేగిన వ్యాఖ్యల వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పవన్ కళ్యాణ్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలను నాగేశ్వర్ ఉపసంహరించుకున్నప్పటికీ, ఆయనపై ఏపీలో నమోదైన కేసులు, అరెస్ట్ ఊహాగానాల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై తాజాగా జనసేన నేత, సినీ నటుడు హైపర్ ఆది తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరును తప్పుబడుతూ, పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే ఆయన అభిమానులు, జనసైనికులు చూస్తూ ఊరుకోరని, సోషల్ మీడియా యుగంలో తిప్పికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతుగా కొంతమంది జర్నలిస్టులు నిర్వహించిన సమావేశంలో ఆంధ్ర ప్రాంత నేతలపై జరిగిన విమర్శలను హైపర్ ఆది తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాన్ని నాగేశ్వర్ తప్పుగా ప్రస్తావించినప్పుడు.. దానికి నిరసనగా జనసైనికులు స్పందించడంలో ఎలాంటి తప్పులేదని ఆది సమర్థించారు. ఇది పాత రేడియో కాలం కాదని, సోషల్ మీడియా కాలమని నాగేశ్వర్ గుర్తుంచుకోవాలన్నారు. కేవలం ఆరోగ్యకరమైన విశ్లేషణలను మాత్రమే ప్రజలు స్వాగతిస్తారని, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను కాదని ఆయన హితవు పలికారు.
ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ చూపిన సంస్కారాన్ని ప్రస్తావిస్తూ హైపర్ ఆది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు. “ప్రొఫెసర్ నాగేశ్వర్ అంతలా తప్పుగా మాట్లాడినా.. ఆయనపై నాకు గౌరవం ఉందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గొప్పోడా? లేదా అంత తప్పు చేసి కూడా, ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ను తిట్టిస్తున్న మీరు గొప్పోరా?” అంటూ నాగేశ్వర్ను నేరుగా నిలదీశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ, కేసుల పేరుతో హైదరాబాద్ వేదికగా ఏపీ నేతలను టార్గెట్ చేయడం సరికాదని, తప్పు జరిగినందు వల్లే జనసైనికులు పోలీసులకు ఫిర్యాదులు చేయాల్సి వచ్చిందని ఆది స్పష్టం చేశారు.









