దేశానికి రుతుపవనాల షాక్: ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎల్ నినో ప్రభావంతో ఐఎండీ ఆందోళనకర అంచనా

భారతీయ వ్యవసాయ రంగానికి మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా 2026 నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (IMD) ఆందోళనకరమైన అంచనాలను వెల్లడించింది. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కురిసే వర్షపాతం దీర్ఘకాల సగటు (LPA)లో కేవలం 90 శాతానికి పరిమితం కావచ్చునని ఐఎండీ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈసారి వర్షాలు ‘సాధారణం కంటే తక్కువ’ కేటగిరీలోకి వస్తుండటంతో జలవనరుల లభ్యత, సాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ బలహీన రుతుపవన పరిస్థితులకు పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావమే ప్రధాన కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా ఎల్ నినో ఏర్పడినప్పుడు రుతుపవన వ్యవస్థలు దెబ్బతిని దేశంలో కరవు పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీనికి తోడు, సాధారణంగా వర్షాలకు మేలు చేసే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) కూడా ప్రస్తుతం తటస్థంగానే ఉండటంతో.. ఈ సీజన్‌లో లోటు వర్షపాతం నమోదయ్యేందుకు ఏకంగా 84 శాతం అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఇది అత్యంత బలహీనమైన రుతుపవన సీజన్‌గా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ప్రాంతాల వారీగా చూస్తే.. దేశంలో అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడే ‘మాన్‌సూన్ కోర్ జోన్’తో పాటు వాయువ్య, మధ్య మరియు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వర్షపాతం చాలా తక్కువగా ఉండనుంది. ముఖ్యంగా జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో కూడిన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికి నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలని, కరవును తట్టుకునే ప్రత్యామ్నాయ విత్తనాలను ఎంచుకుంటూ రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు