సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై పౌరుల మౌనం అత్యంత ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నోరు విప్పాలని సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి పిలుపునిచ్చారు. ‘మనకెందుకులే’ అని ప్రజా సమస్యలను దాటుకెళ్లే మనస్తత్వాన్ని వీడాలని, సమాజ హితం కోసం గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె స్పష్టం చేశారు. లడఖ్ రాజ్యాంగ హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు మద్దతు ప్రకటిస్తూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
దేశంలో ఎలాంటి విపత్తులు లేదా ప్రజా సమస్యలు తలెత్తినా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని మార్పు కోసం అందరూ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని, కనీసం సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారానైనా గొంతు కలపాలని కోరారు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై అవగాహన పెంచుకోవడం పౌరులుగా మన కనీస బాధ్యత అని గుర్తుచేస్తూ.. నిస్వార్థంగా ప్రజల కోసం, ప్రకృతి కోసం పోరాడే వాంగ్చుక్ లాంటి యోధులకు సమాజం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.
కేవలం రాజకీయ నాయకులను వేలెత్తి చూపించడంతోనే మన బాధ్యత తీరిపోదని, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పౌరులంతా కార్యోన్ముఖులు కావాలని ఆమె ఆకాంక్షించారు. సమాజంలో చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఊరుకోవడం తనను తీవ్రంగా కలచివేస్తోందని మంచు లక్ష్మి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతుండటంతో పాటు నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.









