మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖను వివరణ కోరాలని టీపీసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కమిటీ చైర్మన్ మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్టీ విధించిన లక్ష్మణ రేఖను ఎవరైనా దాటితే చర్యలు తప్పవని మల్లు రవి స్పష్టం చేశారు. సుస్మిత వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీశారు. వ్యవహారానికి సంబంధించిన పూర్తి నివేదికను టీపీసీసీ అధ్యక్షుడి నుంచి కోరినట్లు సమాచారం.
వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం నిర్వహించిన కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని వ్యాఖ్యానించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది.









