తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20) దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానుండగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులో పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాలని చంద్రబాబు కోరనున్నారు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఆస్తులు-అప్పుల పంపకం, పెండింగ్ ఆర్థిక అంశాలు, రెవెన్యూ గ్యాప్, పన్నులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించనున్నారు. దుగరాజుపట్నం పోర్టు, విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు అంశాలను కూడా సమావేశంలో చర్చకు తీసుకురానున్నారు.
అలాగే విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని సీఎం కోరనున్నారు. రైల్వే, విమానాశ్రయాల కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అందిస్తున్న సహకారానికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు, నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది.









