అసభ్యకర పోస్టులపై అనసూయ గళం..
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తనపై కొందరు వ్యక్తులు వ్యవస్థీకృతంగా దూషణలకు దిగుతున్నారంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు 70కి పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్పై ఆమె ఫిర్యాదు చేయగా, ఇప్పటికే పలువురిని గుర్తించి విచారిస్తున్నారు.
నల్గొండ నిందితుడి అరెస్ట్ – సాంకేతిక ఆధారాలు..
తాజా విచారణలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన దొరెపల్లి చంటి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ‘చంటిదొరెపల్లి’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అనసూయను కించపరుస్తూ అభ్యంతరకరమైన కంటెంట్ను పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. డిజిటల్ ఫుట్ప్రింట్స్ మరియు ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. గతంలోనే ఇదే కేసులో కడపకు చెందిన మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
నెటిజన్లకు పోలీసుల గట్టి హెచ్చరిక..
ఈ కేసు నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అజ్ఞాతంగా ఉన్నామనే ధీమాతో సెలబ్రిటీలపై లేదా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడితే ఐటీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి పోస్ట్ నిరంతరం నిఘాలో ఉంటుందని, టెక్నాలజీ సాయంతో ఎంతటి వారినైనా పట్టుకోవడం సాధ్యమేనని హెచ్చరించారు. సోషల్ మీడియాను ఇతరులను వేధించడానికి వాడితే భవిష్యత్తు అంధకారమవుతుందని సూచించారు.









