కాకినాడ జిల్లా పిఠాపురంలో అధికార కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంగళవారం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA) కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరియు జనసేన నాయకుడు పెండెం దొరబాబు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా సంఘాలకు చెక్కులు, సెల్ఫోన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కాస్తా రెండు వర్గాల తోపులాటతో రసాభాసగా మారింది.
కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా అధికారుల పక్షపాత వైఖరిపై ఆయన నిలదీస్తుండగా, ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జోక్యం చేసుకున్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవ చేయడం సరికాదని దొరబాబు అనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దూసుకురావడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఘర్షణతో తీవ్ర మనస్తాపానికి గురైన వర్మ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం వర్మ తన సీటును త్యాగం చేసినప్పటి నుండి, నియోజకవర్గ ఆధిపత్యం విషయంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య లోలోపల అసంతృప్తి నెలకొంది. ఈ ఫ్లెక్సీ వివాదం ఆ ఆధిపత్య పోరుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిత్రపక్ష నేతపై భౌతిక దాడికి యత్నించడం అప్రజాస్వామికమని టీడీపీ శ్రేణులు మండిపడుతుండగా, వర్మ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.









