పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైనప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ భీష్మించుకోవడాన్ని సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం ఫలితాలను అధికారికంగా ప్రకటించిన మరుక్షణమే పాత ముఖ్యమంత్రి పదవి రద్దవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవించకుండా ఇంకా సీఎం కుర్చీలో కూర్చోవాలనుకోవడం అక్రమ చొరబాటు కిందకే వస్తుందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అని ఆయన మండిపడ్డారు.
మమతా బెనర్జీ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోకపోతే గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి ఆమెను బర్తరఫ్ చేయాలని జెఠ్మలానీ సూచించారు. ఒకవేళ ఆమె మొండికేస్తే పోలీసులను పంపి మరీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయటకు గెంటేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 స్థానాలను దొంగిలించారంటూ ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే కోర్టులకు వెళ్లి నిరూపించుకోవాలని, అంతేకానీ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు.
మరోవైపు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా మమత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఎవరి సొంత ఇష్టాయిష్టాల ప్రకారం నడవదని, నిర్ణీత సమయం ముగిసిన తర్వాత గవర్నర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ పదవీ కాలం మే 7తో ముగియనుండటంతో, మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.









