రాజకీయ వ్యూహకర్తగా తెరవెనుక చక్రం తిప్పిన కీర్తనా సంపత్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి శివకాశి నియోజకవర్గపు మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున పోటీ చేసిన ఆమె, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే భారీ మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నియోజకవర్గంలోని తెలుగు మాట్లాడే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె తెలుగులో ప్రచారం చేయడం ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కీర్తనా సంపత్ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసిన ఆమె, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (ఐప్యాక్) బృందంలో డేటా అనలిస్ట్గా పనిచేశారు. పశ్చిమ బెంగాల్, గోవా ఎన్నికలతో పాటు 2021 తమిళనాడు ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ విజయం కోసం తెరవెనుక వ్యూహాలు రచించారు. ఆ తర్వాత హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ (TDP) సోషల్ మీడియా విభాగానికి లీడ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలోనే ఆమెకు తెలుగు భాషపై పట్టు లభించింది.
తన సొంత ప్రాంతమైన శివకాశిలో మౌలిక సదుపాయాల కొరత, నిరుద్యోగం మరియు వలసల వంటి సమస్యలు ఆమెను రాజకీయాల వైపు నడిపించాయి. లక్షల్లో జీతం వచ్చే తన లగ్జరీ ఉద్యోగాన్ని వదిలేసి, సొంతూరికి వచ్చి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియా ద్వారా స్థానిక సమస్యలను ఎండగడుతూ ప్రజలకు చేరువయ్యారు. ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన విజయ్, ఎన్నికలకు నెల రోజుల ముందే టికెట్ కేటాయించగా.. ఆమె తన వినూత్న ప్రచారంతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.









