బెంగళూరుకు చెందిన డానిష్ అబ్ది, వృశాలి ప్రసాదె అనే దంపతులు అరుదైన సాహసంతో చరిత్ర సృష్టించారు. పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉన్న రామసేతు మార్గంలో వీరు శ్రీలంక నుంచి భారతదేశానికి ఏకధాటిగా ఈది అద్భుతాన్ని ఆవిష్కరించారు. శ్రీలంకలోని తలైమన్నార్ వద్ద తమ ఈతను ప్రారంభించిన ఈ సాహస జంట, ఏకంగా 10 గంటల 45 నిమిషాల పాటు సముద్రంలో నిర్విరామంగా శ్రమించి చివరకు భారత్లోని ధనుష్కోడి తీరానికి సురక్షితంగా చేరుకున్నారు.
ఈ సుదీర్ఘ సముద్ర ప్రయాణం ఏమాత్రం సులభంగా సాగలేదు. బలమైన సముద్ర ప్రవాహాలు, భయంకరమైన అలలు, తీవ్రమైన అలసట వంటి ఎన్నో కఠిన సవాళ్లను ఈ జంట తమ అపారమైన సంకల్ప బలంతో అధిగమించారు. సముద్రంలో అనూహ్యంగా మారే వాతావరణ పరిస్థితులను తట్టుకుని వీరు ఈతను కొనసాగించారు. వీరి భద్రత దృష్ట్యా, సహాయక బృందాలు, పారామెడికల్ సిబ్బందితో పాటు కోస్ట్ గార్డ్ దళాలు కూడా వీరిని ఎప్పటికప్పుడు వెన్నంటి ఉండి పర్యవేక్షించాయి.
ధనుష్కోడి తీరానికి చేరుకుని ఈ అరుదైన లక్ష్యాన్ని పూర్తి చేసిన వెంటనే, ఈ దంపతులు తమ ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. “శ్రీలంక నుంచి భారత్ వరకు 10 గంటల 45 నిమిషాల కఠిన ప్రయాణాన్ని పూర్తి చేశాం. ముందుగా 12 గంటలపాటు అలారం లేకుండా నిద్రపోయాక మరిన్ని వివరాలు చెబుతాం” అంటూ సరదాగా పోస్ట్ చేశారు. మణిపాల్ హాస్పిటల్స్ సహకారంతో చేపట్టిన ఈ సాహస యాత్ర.. కేవలం రికార్డు కోసమే కాకుండా భారత్-శ్రీలంక దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి ఒక ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.









