కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో దాదాపు కోటి రూపాయల విలువైన స్వామివారి బంగారు కిరీటం మాయమవడం (అక్రమంగా తాకట్టు పెట్టడం) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమ ఉదంతం వెలుగులోకి రావడంతో దేవదాయ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సమాచారం అందుకున్న వెంటనే దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని, అర్చకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం దేవస్థాన నిర్వహణ ట్రస్ట్ కార్యాలయం తాళాలు తెరిపించి కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణకు ముందే సమాచారం ఇచ్చినప్పటికీ ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా అందుబాటులోకి రాకుండా పరారవ్వడం, ఫోన్లలో దాటవేత సమాధానాలు చెప్పడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దర్యాప్తులో భాగంగా కిరీటాన్ని స్వామివారికి విరాళంగా ఇచ్చిన దాత కుటుంబ సభ్యులను అసిస్టెంట్ కమిషనర్ లలిత స్వయంగా కలిసి మరిన్ని వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ ఆలయ కమిటీ దేవదాయ శాఖ అధికారిక పరిధిలో లేకపోవడం వల్ల నేరుగా తక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నామని, స్వాధీనం చేసుకున్న రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చట్టపరమైన అడుగులు వేస్తామని ఆమె స్పష్టం చేశారు. మధ్యాహ్నంలోపు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక సమర్పించాల్సి ఉండటంతో ఆలయంలోనే ఉండి విచారణను ముమ్మరం చేశారు. మరోవైపు, దేవుడి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న సదరు బంగారు కొట్టు వ్యాపారి కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, తనకివ్వాల్సిన తాకట్టు డబ్బులు తిరిగి తన ఖాతాలో జమ చేస్తేనే ఊరికి వస్తానని అతను ట్రస్ట్ బోర్డుకు వర్తమానం పంపినట్లు తెలుస్తోంది.
ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆలయానికి చేరుకుని ట్రస్ట్ బోర్డు సభ్యుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దారుణమైన ఘటన వల్ల గుడివాడ పట్టణానికే తీవ్రమైన అవమానం జరిగిందని, దేవుడి సొత్తుతో వ్యాపారం చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. సాయంత్రంలోగా బంగారు కిరీటాన్ని వెనక్కి తెచ్చి స్వామివారికి అలంకరించకపోతే భక్తులనందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఘోర అపచారానికి పాల్పడిన కమిటీ సభ్యులతో పాటు, దాన్ని అక్రమంగా తాకట్టు పెట్టుకున్న వ్యాపారిపై కూడా కఠిన క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఉన్నత స్థాయిలో న్యాయపోరాటం చేస్తామని యలవర్తి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.









