మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్) గురువారం (మే 21) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఓపెనింగ్ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒకే కారులో రావడం.. ఆ తర్వాత మెగా బ్రదర్స్ ముగ్గురూ (చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు) ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చుని ముచ్చటించడం ఈ వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగా ఫ్యాన్స్కు ఈ విజువల్స్ పండగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ ముహూర్తపు పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కొబ్బరికాయ కొట్టి సినిమాను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం స్వామివారిపై చిత్రీకరించిన మొదటి ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవిపై పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి, చిత్ర యూనిట్ మొత్తానికి తన ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు. చిరంజీవి కుమార్తె, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెలతో కలిసి సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్ కెమెరా స్విచ్ఛాప్ చేశారు. టాలీవుడ్ లెజెండరీ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ మరియు నాగబాబు సంయుక్తంగా ఈ చిత్ర స్క్రిప్ట్ను దర్శకుడు బాబీ కొల్లికి అందజేశారు.
ఈ అట్టహాసమైన లాంచింగ్ ఈవెంట్లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, కేఎస్ రామారావులతో పాటు దర్శకులు మెహర్ రమేష్, వశిష్ఠ, నటుడు బండ్ల గణేష్, నిహారిక కొణిదెల తదితరులు పాల్గొని సందడి చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అనస్వరా రాజన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత చిరు-బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్ పై అటు ట్రేడ్ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.









